మహిళల హక్కులు డా.అంబేద్కర్ దృక్పథం - బి. విజయభారతి
మహిళల హక్కులు డా.అంబేద్కర్ దృక్పథం
- బి. విజయభారతి
డా. బి.ఆర్.అంబేద్కర్ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. 'ప్రజాస్వామ్యం', 'అంటరానితనం', 'కుల నిర్మూలన', 'మతమార్పిడి', 'బౌద్ధమతం', 'హిందూమతంలోని చిక్కుముడులు', 'ఆర్థిక సంస్కరణలు-దళితులు', 'భారతదేశ చరిత్ర' మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి.
కానీ, స్త్రీల అణిచివేత, స్త్రీల విముక్తిపై ఆయన చేసిన రచనల గురించి మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
ప్రముఖ విద్యావేత్త, స్త్రీల హక్కుల కోసం కృషి చేస్తున్న డా. విజయభారతి స్త్రీల సమస్యలపై అంబేద్కర్ రాసిన రచనలను ఈ పుస్తకంలో పరిచయం చేసి వాటిని విశ్లేషించారు.
పుత్ర సంతానమూ పాతివ్రత్యమూ ఈ రెండే స్త్రీలకు సమాజంలో గౌరవాన్నిస్తాయని నమ్మించిన పూర్వ వ్యవస్థపై తిరుగులేని పోరాటం చేసి స్త్రీలను హక్కుల దిశలో నడిపించిన డా. అంబేద్కర్ ప్రయత్నాలను ఈ పుస్తకంలో చూడవచ్చు.
డా. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టర్గా పదవీవిరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేద్కర్, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు - కుల వ్యవస్థపై ఐదు పుస్తకాలు రాశారు.
మహిళల హక్కులు డా.అంబేద్కర్ దృక్పథం
- బి. విజయభారతి
నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్రావు అంబేద్కర్ మహామహుడు - నార్ల వెంకటేశ్వరరావు ...
బాబా సాహెబ్ అంబేద్కర్
(జీవిత చరిత్ర)
రచన: బి.విజయభారతి
ఈ పుస్తకానికి 1982లో నార్ల వెంకటేశ్వరరావు రాసిన పీఠిక నుంచి ...
ఒక ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ అన్నాడు - గాంధీ కంటె, జిన్నా కంటె మహదేవ గోవింద రెనడే అనేక విధాల మహామహుడని.
ఈ పీఠికలో నేనంటున్నాను - నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్రావు అంబేద్కర్ మహామహుడని.
నెహూృ నేతాజీలవలె అంబేద్కర్ జన్మించింది అగ్రకులంలో కాదు, నిమ్నాతి నిమ్నమైన దానిలో. వారివలె ఆయన సంపన్న కుటుంబంలో పెరగలేదు. కటిక దారిద్య్రంలో పెరిగాడు. అడుగడుగునా అవమానాల మధ్య పెరిగాడు. ఒక గాంధీకి, ఒక సి.ఆర్.దాస్కు కూర్చినట్టు ఆయనకు రాజకీయంగా ప్రోత్సాహ ప్రోద్బలాలను కూర్చినవారు లేరు. సరిగదా, ఎందరెందరో ఆయనను అణగద్రొక్కడానికి ప్రయత్నించారు.
అయినా డాక్టర్ అంబేద్కర్ మహోన్నత స్థితికి రాగలగడం స్వయం కృషి వల్లనే, స్వీయ ప్రతిభ వల్లనే. విద్యా విజ్ఞానాలలో ఆయనకు సాటి రాగలవారు తక్కువ. ప్రజ్ఞా ప్రాభవాలలో ఆయనను మించగలవారు లేరనే చెప్పవచ్చు.
ధైర్య సాహసాలలో ఆయన స్థానం ప్రథమ శ్రేణిలో. శీల సంపదకు ఆయన సరసన నిలవగలవారు ఈనాటి భారత వర్షంలో బహుశా ఒక్కరైనా లేరు.
ఇవి ముఖస్తుతులనడానికి, వీటిని విని నాకు ఏదో కట్టబెట్టడానికి అంబేద్కర్ సజీవుడైలేడు. పోతే, ఇవి ఆత్యుక్తులనడానికి ఎవరైనా సాహసిస్తే వారికి భారత సాంఘిక చరిత్ర ఆణుమాత్రంగానైనా తెలియదనే చెప్పవలసి వుంటుంది.
... ... ... ... ...
బానిసత్వం కంటె అతి నీచమైనది, నికృష్టమైనది, అత్యంత క్రూరమైనది, కఠోరమైనది, ఆద్యంతం అధమాధమమైనది, అమానుషమైనది - అస్పృశ్యత.
ప్రపంచం మొత్తం మీదనే మరొక దేశంలో ఈ విధమైన రాక్షసత్వం కానరాదు.
.... ... ... ...
అస్పృశ్యతపై హిందూ దేశంలో తిరగబడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కావడం ఏ దృష్టితో చూచినా ఒక గొప్ప విశేషం.
ఆయన గురించి చదివినకొద్దీ ఆయన పట్ల నాకున్న ప్రేమ గౌరవాలు పెరుగుతూ పోతున్నాయి.
అయితే ఆయన సాగించిన తిరుగుబాటు సాగవలసిన మేరకు సాగలేదు.
కొన్ని విషయాలలో సాగవలసిన మార్గాలలో సాగలేదు కూడా.
అందువల్లనే ఈనాడు దేశంలో ఏదో ఒకమూల అస్పృశ్యులపై ఏదో ఒక అత్యాచారం, ఏదో ఒక అమానుష చర్య జరిగినట్టు దినపత్రికలలో వార్తలు వస్తూనే వున్నాయి.
కాగా, పత్రికలకెక్కని ఘోరాలలెన్నో, క్రౌర్యాలెన్నో ఎవరు చెప్పగలరు?
ఈ దుర్భర పరిస్థితి తొలగాలంటే ఒక అంబేద్కర్ చాలడు.
ఆయన అంతస్తును అందుకొనలేకపోయినా, కనీసం ఆయన ప్రతిభలో, ఆయన స్వేచ్చా �ప్రవృత్తిలో, ఆయన నిష్కలంక శీలంలో శతాంశాన్ని చూపగలవారైనా కొన్ని వందలమంది ఆ సంఘం నుంచి పైకి రావాలి.
అందుకు కావలసిన ఉత్కంఠను, అందుకు కావలసిన ఉత్తేజాన్ని
డాక్టర్ బి.విజయభారతి రచించిన అంబేద్కర్ జీవిత చరిత్ర కలిగించగలదని ఆశిస్తున్నాను.
పెక్కు గ్రంథాలను పరిశోధించి సరళమైన శైలిలో, సమగ్రమైన రీతిలో ఈ రచనను చేసినందుకు ఆమెను నేను అభినందిస్తున్నాను.
ఆమె రచనలో ఆలోచనతోపాటు ఆవేదన వున్నది.
జీవంతో పాటు జవం వున్నది.
ఇది జీవిత చరిత్ర అయినా నవల వలె సాఫీగా నడుస్తున్నది.
కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలె ముఖ్య దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్నది.
దీనిలో చెదురుగా కొన్ని లోపాలుంటే అవి పట్టించుకోదగినవి కావు.
ఇంతటితో సరిపుచ్చక అస్పృశ్య సంఘంలో నవచైతన్యానికి, విప్లవోత్సాహానికి దోహదం కూర్చగల మరి పెక్కు రచనలను డాక్టర్ విజయభారతి కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను.
- నార్ల వెంకటేశ్వరరావు, జూన్, 1982, లుంబిని, బంజారాహిల్స్, హైదరాబాద్, 500034
బాబా సాహెబ్ అంబేద్కర్
భారతదేశంలో కులాలు - వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ... తెలుగు అనువాదం : భార్గవ ...
భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ...
1916 మే 9వ తేదీన కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ అమెరికాలో జరిగిన డాక్టర్ ఎ.ఎ.గోల్డెన్ వైజర్ స్మారక ఆంత్రోపాలజీ సెమినార్లో చేసిన ప్రసంగ పాఠం.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అధ్యయనశీలతకు, శాస్త్రీయ దృక్పథానికి, తర్క పటిమకు ఈ చిన్న పుస్తకం ఒక ఉదాహరణ.
ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, సమాజంలో అట్టడుగున నలిగిపోయే దళితుల విముక్తి కొరకు తదనంతర కాలంలో తాను నిర్మంచిన దళిత చైతన్య, విముక్తి ఉద్యమాలకు సైద్ధాంతిక భూమికను ఆయన చాలా మ,ధుగానే తయారుచేసుకున్నారు అనడానికి ఈ ప్రసంగపాఠం ఒక నిదర్శనం.
కులం పుట్టుక అన్నది ఇప్పటికీ పరిష్కారం దొరకని ఒక వివాదాస్పద అంశంగానే ఉన్నప్పటికీ, 1916 నాటి ఈ ప్రసంగం కులం పుట్టుక - పరిణామం విషయంలో నేటికీ కొత్త ఆలోచనలను రేకెత్తించగల శక్తిని కలిగి వున్నది.
అనువాదకులు భార్గవ ప్రజాభ్యుదయ సంస్థ (కర్నూలు) ప్రధాన కార్యదర్శి. మార్క్సిస్టు రాజకీయ కార్యకర్తగా పనిచేసే వీరు సామాజిక వ్యవస్థ,ఉద్యమాలు, రాజకీయ వ్యూహాలకు మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడంపై ఆసక్తి కలిగివున్నారు.
భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృది
- బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు అనువాదం : భార్గవ
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు: యాజ్ఞి ...
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటీష్ పాలనలో 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది.
బ్రిటీష్ వాళ్లు ఈ దేశాన్ని అక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ల సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్లు అమలు చేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది.
ఆధునిక విద్య, ఉపాథి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్ సూటిగా ప్రశ్నిస్తారు.
అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటీషు పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్లూనుకునేట్టు చేసిన బ్రిటీష్ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు.
అనువాదకులు యాజ్ఞి ఆ లంపూరు (మహబూబ్నగర్)కు చెందినవారు. ఆయనకు అధికారం-విస్మృతి ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు: యాజ్ఞి
రాష్ట్రాలు - మైనారిటీలు ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ...తెలుగు అనువాదం: హారతి వాగీశన్ ...
రాష్ట్రాలు - మైనారిటీలు
స్వతంత్ర భారత రాజ్యాంగంలో వారి హక్కులేమిటి? వాటిని సాధించుకోవడం ఎట్లా?
... అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య తరఫున భారత రాజ్యాంగ నిర్ణయసభకు షెడ్యూల్డు కులాల రక్షణలకు సంబంధించి
సమర్పించిన నివేదిక (ప్రచురణ 1947)...
ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక
నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష.
ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ కుల
సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం.
పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు
కులాలవారికి ప్రత్యేక హక్కులుండాలన్నది అంబేడ్కర్ వాదం. అ ల్పసంఖ్యాకులు (మైనారిటీలు) అంటే హిందూ మతంలో లేనివారు
అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డ్ కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని
నిరూపించారు.
రాజ్యాధార సామ్యవాదం (స్టేట్ సోషలిజం) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక
సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనా పటిమను ఇందులో చూడవచ్చు.
అనువాదకులు హారతీ వాగీశన్ ఖిల్లా ఘన్పూర్ (మహబూబ్నగర్)కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి, యూజీసీ ఢిల్లీ వారి రీసెర్చ్
ఫెలోషిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''పంచాయితీ రాజ్ వ్యవస్థలో నాయకత్వం'' విషయంలో పరిశోధన పూర్తి చేసే దశలో
వున్నారు.
రాష్ట్రాలు - మైనారిటీలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు అనువాదం: హారతి వాగీశన్
74 పేజీలు, వెల:రూ.25
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు ... ప్రొఫెసర్ బాల్చంద్ర ముంగేకర్ ... తెలుగు అనువాదం: అ ల్లం నారాయణ ...
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు
ఒక అంబేడ్కర్వాద దృక్పథం
మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యునివర్సిటీ, లండన్లో ముంబాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాల్చంద్ర ముంగేకర్ చేసిన డాక్టర్ అంబేడ్కర్ స్మారక ప్రసంగపాఠం
భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్న ప్రణాళిక చేస్తున్న ప్రణాళిక సంఘం సభ్యులుగా వున్న డాక్టర్ బాల్చంద్ర ముంగ్రేకర్ దేశంలో అగ్రగణ్యులైన వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్తలలో ఒకరు. ప్రణాళిక సంఘం బాధ్యతకలు చేపట్టడానికన్న ముందు ఆయన ముఐబాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా పనిచేశారు. అ లాగే, ప్రతిభావంతులైన ఒక సామాజిక తత్వవేత్త. సంస్కర్త. ఆయన ప్రతిభావ్యృత్పత్తులు గల అనేక అకడమిక్ పదవులు అధిష్టించారు. ముఐబాయి యూనివర్శిటీ ''అడ్వాన్స్డ్ స్టడీ సెంటర్'' చైర్మన్గా, భారత సాంస్కృతిక సంబంధాల మండలి సభ్యుడుగా, ''డాక్టర్ అంబేడ్కర్ సామాజిక, ఆర్థిక పరిణామాల సంస్థ'' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇతర ప్రతిష్టాత్మక పనులను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రాలలో ప్రావీణ్యతకు గుర్తింపుగా 1999లో భారత ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ ధరవరల మండలి సభ్యునిగా నియమించింది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో పలు ప్రభుత్వ కమిటీలలో కూడా ఆయన సేవలు అందించారు.
డాక్టర్ ముంగేకర్ను అంబేడ్కర్ ఆలోచనావిధానం వెలుగులో సాగే ఉద్యమాలలో అగ్రగణ్యుడైన నిపుణుడుగా భావిస్తారు.
ఆర్థిక సంస్కరణలు పేదలపై, ముఖ్యంగా దళితులపై కలుగజేస్తున్న దుష్పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు - ఒక అంబేడ్కర్వాద దృక్పథం
-ప్రొఫెసర్ బాల్చంద్ర ముంగేకర్
తెలుగు అనువాదం: అల్లం నారాయణ
రాముని కృష్ణుని రహస్యాలు
అంబేడ్కర్ మరణానంతరం ఆయన సంపూర్ణ రచనలను ప్రచురించే బాధ్యతను మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా మూడు
సంపుటాలు వెలువడ్డాయి. ''రిడిల్స్ ఇన్ హిందూయిజం'' నాలుగవ సంపుటం. అందరూ అనుకున్నట్టే ఈ పుస్తకం బయటకు రాగానే గొప్ప సంచలనం సృష్టిస్తూ పెద్ద వివాదాన్ని రేపింది.
హిందూ మతం పై విమర్శలున్నాయని, అసభ్యకరమైన రాతలున్నాయని, ఈ పుస్తకం లోని ''ది రిడిల్ ఆఫ్ రామా అండ్ కృష్ణా'' లో తమ దేవుళ్లను కించపరిచే రాతలున్నాయని, దీన్ని సహించేది లేదని, వెంటనే ఆ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, అందులోని కొన్ని భాగాలను తొలగించాలని, మరాఠా మహా సంఘం వారు, శివసేన వారు పెద్ద ఎత్తున ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురు చూస్తున్న మేధావులు,
దళితులు, ప్రజాస్వామిక శక్తులు ఈ సంఘటనతో కలవరపడ్డాయి. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, శక్తి వుంటే వాటిని ఖండించాలి గానీ నిషేధించాలనే హక్కు ఎవరికీ లేదని, తన అభిప్రాయాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ప్రతి రచయితకూ ఉన్నదని, దానిని ఇతరులు గౌరవించాలని, అంబేడ్కర్ అభిప్రాయాలను తొలగించాల్సిన అవసరం లేదని దేశంలోని మేధావులు అభిప్రాయపడ్డారు.
డా.అంబేడ్కర్ రచనలు ప్రచురించే బాధ్యత మాత్రమే ప్రభుత్వం స్వీకిరించింది కానీ దానిలో మార్పులు, మినహాయింపులు చేసే హక్కు ఎవరికీ లేదని ''రిడిల్స్ ఇన్ హిందూయిజం'' పుస్తకాన్ని యధాతథంగా అమ్మకానికి విడుదల చేయాలని దళితులు, లక్షలాది ప్రజలు, అభ్యుదయ వాదులు, ముంబాయి, నాగపూర్ పట్టణాల్లో గొప్ప ప్రదర్శనలు జరిపారు.
ఒక రచయితకున్న భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి లక్షలాది ప్రజలు ఆందోళన చేయటం అనేది చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకోక ముందే ప్రభుత్వం రెండు వర్గాలకు రాజీ కుదురుస్తూ ''అంబేడ్కర్ భావాలతో ప్రభుత్వం అంగీకరించడం లేదు'' అనే వాక్యాన్ని చేర్చి పుస్తకాన్ని యధాతథంగా విడుదల చేసింది. అదే ఈ పుస్తకం.
దీని అనువాదకులు డా. విజయభారతి, బొజ్జా తారకం గార్లు.
విజయనారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ఫూలే, అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.
బొజ్జా తారకం గారు ప్రముఖ న్యాయవాది. పౌరహక్కులు, దళితుల సమస్యలపై తోడ్పడుతున్న వ్యక్తి. ''పోలీసులు అరెస్టు చేస్తే '' అన్న వీరి రచన తెలుగునాట ప్రత్యేకించి పౌరహక్కుల రంగంలో విశేష ప్రాచుర్యం పొందింది.
రాముని కృష్ణుని రహస్యాలు
రచన: డా. బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు అనువాదం: డా.బి.విజయభారతి, బొజ్జా తారకం
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067 ఫోన్: 040 2352 1849
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్, బర్కత్పుర,
హైదరాబాద్ -500027 (ఫోన్ 040-23449192)
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
శూద్రులు - ఆర్యులు - డా. బి.ఆర్.అంబేడ్కర్ ... అనువాదం : బొజ్జా తారకం
శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్.అంబేడ్కర్
భారతదేశంలో కుల సమస్య చాలా ప్రధానమైనట్టిది.
సామాజిక శాస్త్రవేత్తలనింకా కలవరపెడుతూనే ఉన్నది.
ఈ సమస్యపై విదేశాలకు చెందిన పరిశోధకులు చేసినంత కృషి భారత దేశంలోని పరిశోధకులు చెయ్యలేదనే చెప్పాలి.
ఈ సమస్యపై కృషి చేసిన పరిశోధకుల్లో డాక్టర్ అంబేడ్కర్ ఒకరు. వేదాలనూ, ఇతర గ్రంథాలనూ పరిశోధించి ఆర్యుల ఉనికి గురించీ, భారతదేశంలో వారి స్థానం గురించీ తెలియజేయడమే కాకుండా ఇంతవరకూ వెనక్కు నెట్టివేసివున్న శూద్రుల సమస్యపై సమగ్ర పరిశోధన చేసి ''హూ వర్ ది శూద్రాస్'' (శూద్రులు ఎవరు?) అనే పుస్తకాన్ని రాశారు.
ఆర్యుల, శూద్రుల మూలాలు, చాతుర్వర్ణ వ్యవస్థలో వారి స్థానాలు ఏమిటి? బ్రాహ్మణులు, శూద్రులు ఎవరెవరు? వర్ణాలు నాలుగా మూడా? అనే విషయాలపై చాలా పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది.
డాక్టర్ అంబేడ్కర్ సూచించిన అంశాలు తీసుకొని సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ సమస్యపై ఇంకా కృషి చేస్తారని మా ఆశ. అందకుండా ఎక్కడో దాచిపెట్టిన విషయాలను తెలుగు పాఠకులకు అందించడానికే ఈ ప్రయత్నం.
అనువాదకులు బోజ్జా తారకం ప్రముఖ న్యాయవాది. పౌరహక్కుల, దళితుల సమస్యల గురించి తోడ్పడుతున్నారు. వీరు రాసిన ''పోలీసులు అరెస్టు చేస్తే...'' పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజోపయోగకరమైన మరెన్నో పుస్తకాలను రచించారు.
శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్.అంబేడ్కర్
-
అనువాదం : బొజ్జా తారకం
అంటబడనివాడు ... అంబేడ్కర్ అనుభవాలు ... తెలుగు అనువాదం: చిట్టిబాబు ...
అంటబడని వాడు ...
ఇవి అంబేడ్కర్ స్వయంగా రాసుకున్న నోట్సులోని విషయాలు.
కొన్ని ఆయన సొంత అనుభవాలు.
మరికొన్ని ఇతరుల అనుభవాలు.
'అంటరానితనం' అంటే ఏమిటో విదేశీయులకి వివరించాలని అంబేడ్కర్ వీటిని రాశారు.
బాల్యంలో ఎదుర్కొన్న వివక్ష, విదేశాలలో పెద్ద చదువులు చదివి ఇండియాకి తిరిగి వచ్చాక ఎదుర్కొన్న అవమానాలూ...
ఇలాంటి వాటి గురి,చి దాపరికం, ద్వేషం లేకుండా వర్ణించారు.
అంబేడ్కర్ ఆత్మకథ రాసుకోలేదు.
అంబేడ్కర్ తన గురించి తాను రాసుకున్న అతి కొద్ది అపురూపమైన నోట్స్ ఇది.
ఇందులో ...
విదేశీయులకి అర్థం కాని విషాచారం
ప్రాణాల మీదికి తెచ్చిన ప్రతిష్ట
ప్రవక్తను ఓడించిన మనువు
పాకీవాడు పటేలైతే...
వంటి శీర్షికలతో అంబేడ్కర్ అనుభవాలు, జ్ఞాపకాలు వున్నాయి.
అంటబడనివాడు
అంబేడ్కర్ అనుభవాలు
ఆంగ్ల మూలం:Ambedkar - Atobiographical Notes,
చరిత్రను మరచినవారు చరిత్రను సృష్టించలేరు ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఈ చిన్న పుస్తకంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారతదేశ చరిత్రపై రాసిన పలు వ్యాసాలున్నాయి. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్లముందుచుతాయి.
గతకాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు , బౌద్ధులు, ముస్లింలు, బ్రిటీష్ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి.
మనదేశ గత చరిత్రపై డాక్టర్ అంబేడ్కర్ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా వుంటాయి.
భారతదేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసరిస్తాయి.
అంతేకాక ఆయన భారతదేశ భవిష్యతుతలోకి కూడా తొంగి చూసి ఈ దేశం మళ్లీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను కూడా సూచిస్తారు.
ఇది చరిత్రపై ఒక మంచి పుస్తకం.
ఇందులోని అధ్యాయాలు:
1. మధ్య ప్రాచ్య దేశాలతో భారతదేశ వాణిజ్య సంబంధాలు.
2. భారతదేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.
3. భారతదేశ చరిత్ర - కొన్ని ముఖ్యాంశాలు.
4. బ్రిటీష్ పాలనలో భారతదేశం.
5. భారతదేశ భవ్యిత్తు.
భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఆంగ్లమూలం: Commmercial Relations of India in the Middle East. - Dr.Bbasaheb Ambedkar, Writings and speeches, Vol.12, pp-30, Govt. of Maharashtra, Bomb` 1993
The Triumph of Brabminism: Regicide or the Birth of Counter-Revolution. op cit. 266, Vol.3.
Notes on History of India, Ps709-718, Vol.12, op cit, Bomb`y 1993 India on the eve of the crown Government, pp 53-72, Vol. 12, op cit Constituent Assembly Debates, 25 Nov. 1949, op.cit, Vol. 13, pp 1213.
తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
72 పేజీలు; వెల: రూ.20
ప్రతులకు వివరాలకు:
1) హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ - 500067
ఫోన్: 040-2352 1849
2) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
నెం.3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్,
బర్కత్పుర, హైదరాబాద్ -500027
ఫోన్: 040-2344 9192
భారతదేశంలో బౌద్ధమతం - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్... తెలుగు అనువాదం: పి.సత్యవతి
'అంబేడ్కర్ ఆలోచన' సిరీస్లో భాగంగా వెలువడిన మరో పుస్తకం.... భారత దేశంలో బౌద్ధ మతం....
'' నేనెందుకు బౌద్ధానికి ప్రాధాన్యత యిస్తానంటే - అది మూడు సిద్ధాంతాల కలయిక.
మరే మతమూ అట్లా కాదు. తక్కిన మతాలన్నీ భగవంతుడు, ఆత్మ మరణానంతర జీవితం గురించి చెబుతాయి.
బౌద్ధం ప్రజ్ఞ గురించి బోధిస్తుంది.
మూఢనమ్మకాలకూ, అతీత శక్తులకూ వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది.
సమతను బోధిస్తుంది.
భూమి మీద ఆనందంగా బ్రతకడానికి ప్రతి వ్యక్తికీ యివి అవసరం.
బౌద్ధంలోని ఈ మూడు సిద్ధాంతాలూ ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యాలి.
భగవంతుడు కానీ అత్మ కానీ సమాజాన్ని కాపాడలేవు. ''
.....
'' నా సామాజిక తాత్వికత మూడు మాటలలో యిమిడి వుంది.
స్వేచ్ఛ,
సమానత్వం,
సౌభ్రాతృత్వం.
దీన్ని నేను ఫ్రెంచి విప్లవం నుంచి గ్రహించలేదు.
నా తాత్వికత మతం నుంచి ఆవిర్భవించిందే తప్ప రాజకీయ శాస్త్రం నుంచి కాదు.
ఈ సిద్ధాంతాలను నేను నా గురువర్యులైన బుద్ధని బోధనల నుండి స్వీకరించాను. ''
- డా. బి.ఆర్.అంబేడ్కర్
ఈ పుస్తక అనువాదకురాలు పి.సత్యవతి ప్రముఖ స్త్రీవాద కథా రచయిత్రి. ''ఇల్లలకగానే...'', ''మంత్ర నగరి'' కథా సంపుటాలను ప్రచురించారు. ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు.
ఇందులోని కొన్ని అధ్యాయాలు:
1. నేనెందుకు బౌద్ధాన్ని ఇష్టపడతాను?
2. బుద్ధుడా - కార్ల్ మార్క్సా?
3. బౌద్ధ - బ్రాహ్మణ సంఘర్షణే భారతదేశ చరిత్ర
4. హిందూ స్త్రీల ఉత్థాన పతనాలు
5. హిందూ, బౌద్ధ మతాలలో స్త్రీల స్థానం
6. ప్రజాస్వామ్యానికీ, సామ్యవాద సమాజానికి మార్గదర్శి బౌద్ధమే
7. భారత దేశంలో బౌద్ధమతం ఆగిపోదు.
భారత దేశంలో బౌద్ధ మతం
- డా.బి.ఆర్.అంబేడ్కర్
ఆంగ్ల మూలం: Dr.Babasaheb Ambedkar, Writings and Speeches, Vol,17,Part 1,2 & 3, Govt. of Maharashtra, bombay, 2003
అంబేడ్కర్ ఆలోచన
అన్ని జాతుల్లో కెల్లా తామే అధికులమని నిరూపించుకోవటానికి హిందువులు చాలా కారణాలు చెప్తుంటారు.
భారతదేశంలో హిందువుల మధ్య బానిసత్వం లేదు,
అంటరానితనం బానిసత్వమంత ప్రమాదకరమైంది కాదు
అన్నవి వాళ్లు చెప్పే రెండు ముఖ్యమైన కారణాలు.
మొదటి వాఖ్యానం అసత్యం.
బానిసత్వం అనేది హిందువుల్లో అనాదిగా కొనసాగింది.
హిందూ ధర్మశాస్త్ర నిర్మాత మనువు బానిసత్వానికి గుర్తింపు నిచ్చాడు.
మనవు తరువాతి స్మృతికారులు బానిసత్వాన్ని విస్తరించి వ్యవస్థీకరించారు.
హిందువుల్లో బానిస వ్యవస్థ ఎప్పుడో పురాతన కాలంలో మాత్రమే ఉండి అంతరించిపోయిన వ్యవస్థ కానేకాదు.
భారత దేశ చరిత్ర ఆదినుంచీ మొన్న మొన్నటివరకూ బానిస వ్యవస్థ కొనసాగింది.
1843లో బ్రిటీషు ప్రభుత్వం కనుక చట్టం ద్వారా బానిసత్వాన్ని నిర్మూలించక పోయి వునట్టయితే అది ఇప్పటికీ కొనసాగుతూనే వుండేది.
బానిసత్వం కొనసాగినప్పుడు అది అటు అంటగలిగినవారికీ ఇటు అంటరానివారికీ ఇద్దరికీ వర్తించింది.
అయితే అంటగలిగిన వారికన్నా అంటరానివారే ఎక్కువగా బానిస వ్యవస్థకు బలయ్యారు.
అందుకు ప్రధాన కారణం వారి పేదరికమే.
1843వరకూ భారతదేశంలో అంటరానివారు
బానిసత్వం, అంటరానితనం
అనే రెండు రకాల దాస్య శృంఖలాలలో బందీలయ్యారు.
... ... ...
అంటరానితనం - బానిసత్వంల మధ్య మరో భేదం ఏమిటంటే బానిసత్వం ఎన్నడూ తప్పనిసరైనది కాదు.
కానీ అంటరానితనం తప్పనిసరిగా వుంటుంది.
ఒక వ్యక్తి మరొకరిని బానిసగా ఉంచుకోవటానికి '' అనుమతి '' వుంటుంది.
కానీ, అతడు అట్లా చేయదలచుకోకపోతే అతడిపై ఎట్లాంటి బలవంతం వుండదు.
మరోవైపు ఒక హిందువు మరొకరిని (ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడిని) అంటరానివాడిగా పరిగణించి దూరంగా వుంచాలన్న నిర్దేశం (కుల/మతపర కట్టుబాటు) వుంటుంది.
అతడి వ్యక్తిగత భావాలు ఏవైనా సరే ఆ నిర్బంధం నుంచి అతడు తప్పించుకోలేడు.
... ...
అంటరానితనమనేది బానిసత్వమంత హీనమైనది కాదా?
బానిసత్వం కన్నా అంటరానితనం తక్కువ హానికరమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వం తక్కువ అమానవీయమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వమే ఎక్కువగా అభివృద్ధిని ఆటంకపరిచిందా?
?????
ఏది హీనం? బానిసత్వమా ... లేక ... అంటరానితనమా ??
-డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
అంబేడ్కర్ ఆలోచన
మనిషికి, ప్రకృతి జ్ఞానానికి హిందూ నాగరికత అందించేదేమిటి?
ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీనమైనదని ప్రతి దేశభక్త హిందువూ ప్రగల్భాలు పలుకుతాడు.
మిగతా ప్రదేశాల్లో మనుషులు నగ్నంగా సంచరిస్తూ ఆదిమ జీవనం సాగిస్తున్నప్పుడే భారతదేశంలో నాగరికత అత్యున్నత దశలో వుండేదని దురహంకారంతో గర్విస్తుంటాడు.
ఈజిప్టు, బాబిలోనియా, జూడియా, రోమ్, గ్రీసు నాగరికతలు నాశనమవుతున్నప్పుడు హిందూ నాగరికత సజీవంగా వుందని అందుకు వారసత్వ శక్తి కారణమని హిందువులు చెప్పుకోవటం కూడా వినవచ్చు.
అయితే అట్లాంటి దృష్టి ఒక కీలకమైన అంశాన్ని జారవిడుస్తుంది.
నాగరికత ప్రాచీనమైనదా, మనగలిగిందా అన్నది మౌలిక అంశం కాదు.
ఒక వేళ అది మనగలిగితే దేనిమీద?
దాని విలువలేమిటి?
ఈ హిందూ నాగరికత సామాజిక వారసత్వం ప్రయోజనకరమైనదేనా?
లేక మన సామాజానికి అది ఒక గుదిబండా?
వివిధ తరగతులకు, వ్యక్తులకు విస్తరించడం ద్వారా, ఎదగడం ద్వారా అది మనకేం అందివ్వనుంది?
.... .... ....
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. హిందువులది నాగరికతేనా?
2. హిందూ నాగరికత
3. కులం - బ్రాహ్మణుల సమర్థన
4. హిందూ ధర్మం
.....
హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
'ఆధునిక' భారతంలో అంటరానితనం ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు అనువాదం: కాత్యాయని
భారతదేశంలోని గ్రామీణ వ్యవస్ణను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్లు ఎందరో వున్నారు.
ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేడ్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు.
తన వాదనకు రుజువులుగా ఇందులో ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు.
ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలూ నిర్దేశించిన వర్య వ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యధాతథంగా కొనసాగుతూనే వుంది.
ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి వుంటుంది.
కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక జీవితం నిర్దేశితమవుతుంది.
ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రయత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది - ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మన కళ్లకు కడతాయి.
భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావొచ్చునేమో గానీ దళితులకు మాత్రం అవి నరకకూపాలని డాక్టర్ అంబేడ్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.
.........
అంబేడ్కర్ ఆలోచన
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, నివేదికలు భారత సమాజ గతిలోనే కొత్త శకానికి నాందిపలికాయి. కులాల దొంతరలో అట్టడుగున పడిపోయి, తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, అకృత్యాలకు, అమానుషాలకు బలైపోయిన అంటరాని కులాల విముక్తి ప్రదాతగా అంబేడ్కర్ అందరికీ తెలుసు.
అయితే ఆయన భావాలు, ఆలోచనల లోతులు చాలా తక్కువ మందికి తెలుసు. సమకాలీన సమాజ ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన అశంబిలన్నింటినీ ఆయన తడిమారు. కేవలం పైపైన మాత్రమే తాకి వదలలేదు. సమగ్రమైన పరిశోధన స్వభావం ఆయన సొంతం.
...
అంబేడ్కర్ రచనలను ఎన్నో రకాల విషయాల కింద విభజించవచ్చు. ఆవిధంగా చిన్న చిన్న పుస్తకాలుగా తీసుకురాగలిగితే పాఠకులకు వాటి అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుందని, విద్యావంతులకు, సామాజిక కార్యకర్తలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాం.
ఇటువంటి ప్రయత్యాలు గతంలో కూడా కొన్ని జరిగాయి. మరికొన్ని సంస్తలు, సొసైటీలు, ట్రస్ట్లు ఇప్పటికే అప్పుడప్పుడు ఇటువంటి పుస్తకాలు ప్రచురిస్తున్నాయి.
అయితే నిరంతరంగా, ఒక కార్యక్రమంగా ఈ ప్రయత్నాలు తెలుగు పాఠకుల ముందుకు తేవాలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా '' అంబేడ్కర్ ఆలోచన'' సిరీస్ పేరుతో ఈ పుస్తకాల ప్రచురణ కొనసాగించాలని భావిస్తున్నాయి.
ఇందులో అంబేడ్కర్ స్వయంగా చేసిన రచనలతో పాటు, అంబేడ్కర్ ఆలోచనను ప్రతిబింబించే గత, వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే ఇతరుల రచనలను కూడా భాగం చేయాలని ఆశిస్తున్నాం.
ఈ ప్రయత్నంలో తెలుగు పాఠకుల, సామాజిక ఉద్యమ కార్యకర్తల దళితేతర విద్యావంతుల, ప్రజాస్వామికవాదుల సహాకారాన్ని ఆశిస్తున్నాం.
మా ఈ కార్యకర్మంలో సూచనలు, సలహాలు, ఇతర రకాలైన సహాయాలు అందించి భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (ఫోన్:+040-2352 1849)
- సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (ఫోన్:+040-2344 9192)
'ఆధునిక' భారతంలో అంటరానితనం
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
దాస్య విముక్తి కోసం మతమార్పిడి ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్... తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
అంబేడ్కర్ ఆలోచన
''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను''
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1935లో చేసిన ప్రకటన యిది.
అన్నట్టుగానే ఆయన 1956లో హిందూమతాన్ని విసర్జించి ఐదు లక్షల మంది అనుచరులతో కలసి మరీ బౌద్ధమతంలో చేరారు.
ఆ మధ్య కాలంలో ఆయన దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించీ వివిధ సభల్లో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
చతుర్ వర్ణ వ్యవస్థ పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటరానివాళ్లకు ... ''హరి జనులు'' ... అనే ఓ కొత్త పేరును అంటగట్టి దళిత సమస్యకు పైపై పరిష్కారం చూపబోయారు గాంధీజీ.
అయితే ఆ పేరు మార్పు వల్ల దళితులకు ఒరిగేదేమీ లేదనీ, తమను అంటరానివాళ్లుగా, అధములుగా పరిగణించే హిందూమతాన్ని వదిలించుకుని బయటకు వచ్చినప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అంటారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు.
మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో,
మీకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా చేసిన మతంలో,
చివరికి సమాజంలో గుక్కెడు మంచినీళ్లు కూడా పుట్టుకుండా చేసిన మతంలో,
మిమ్మల్ని జంతులవుకంటే హీనంగా చూసే ఈ హిందూ మతంలో
ఇంకా మీరెందుకు పడివుండాలి???
అని ప్రశ్నిస్తారు అంబేడ్కర్.
ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేయగల మతం ఏదైనా వుందీ అంటే
అది బౌద్ధ మతం మాత్రమే అంటారాయన.
డాక్టర్ అంబేడ్కర్ మరాఠీలో చేసిన ఈ ప్రసంగాలను వసంతమూన్ తన సహచరులతో కలిసి అంగ్లంలోకి అనువదించారు. ఇవి అంబేడ్కర్ రచనల మూడో సంపుటంలో 17వ వాల్యూంలో పొందుపరచబడ్డాయి. వాటి వివరాలు:
1.మీరు విముక్తిపొందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు.
(17 మే 1936 నాడు కళ్యాణ్లో చేసిన ప్రసంగం)
2. మన దాస్య విముక్తికి మార్గమేది?
(13 మే 1936 నాడు దాదర్లో చేసిన ప్రసంగం)
3. బానిస బంధాల నుంచి బయట పడేందుకే బౌద్ధమత స్వీకారం
(15 అక్టోబర్ 1956 నాడు నాగపూర్లో చేసిన ప్రసంగం)
4. అనుబంధం: బుద్ధ ధమ్మమే ప్రపంచాన్ని రక్షిస్తుంది (డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధ మత స్వీకార విశేషాలు)
దాస్య విముక్తి కోసం మతమార్పిడి
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
హిందూ సమాజం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానకి తనకు చివరగా మరొక అవకాశం ఇవ్వవలసిందని గాంధీ ప్రాధేయపడడటమే గాక, కొద్ది సంవత్సరాలలోనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను అంతం చెయ్యడానికి తాను ఇతర హిందూ నాయకులతో కలిసి తీవ్రంగా ప్రయత్నించగలనని ''పూనా ఒడంబడిక'' సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్కు హామీ యిచ్చారు.
అది 1932 సెప్టెంబర్లో జరిగింది.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1936లో డాక్టర్ అంబేడ్కర్ ఈ కుల నిర్మూలన వ్యాసాన్ని గ్రంథ రూపంలో వెలువరించారు.
అంటే ఏమిటి?
హిందూ సమాజాన్ని మార్చడానికి ఆ నాలుగు సంవత్సరాలలో ఎట్టి ప్రయత్నమూ జరగలేదన్నమాటే కదా!
అతి ప్రధానమైన ఒక ఒడంబడిక సందర్భంగా చేయబడిన వాగ్దానాలను కూడా హిందూ అగ్రకుల నాయకులు పట్టించుకోకపోతే ఇక అట్టి మతంలో వుండి ఏం ప్రయోజనం?
అందుకే తన ఈ వ్యాసంలో అంబేడ్కర్ మతం మార్చే ప్రస్తావనను తేవడం తప్పనిసరి అయింది.
''అత్త పెట్టదు అడుక్కు తిననివ్వదు'' అన్న సామెతలాగా
హిందూ నాయకులు కులాన్ని వదలరు.
అంటరానితనాన్ని నిర్మూలించరు.
దళితుల్ని మతం మారనివ్వరు.
ఇంత అన్యాయం మరెక్కడైనా వుంటుందా?
పోనీ నాలుగు సంవత్సరాలలో మార్పు సాధ్యం కాదని అనవచ్చు. మరి పూనా ఒప్పందం జరిగి ఇప్పటికి 76 సంవత్సరాలైంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 61 సంవత్సరాలు దాటింది.
అయినా ఏమంత మార్పు జరిగింది?
అందరూ ముఖ్యంగా హిందూ అగ్ర నాయకులు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది.
హిందూ సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు తమ వర్గ ప్రయోజనాల కొసమే తప్ప మొత్తం ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించలేడంలేదు అన్నారు అంబేడ్కర్.
ఆ దురదృష్టం ఇంకా కొనసాగుతూనే వుంది.
- బోయి భీమన్న (ఐదవ ముద్రణకు రాసిన ముందుమాట నుంచి)
కుల నిర్మూలన
- డా.బి.ఆర్. అంబేడ్కర్
తెలుగు అనువాదం: బోయి భీమన్న
నాకు ఈ బుక్స్ అన్నీ కావాలి ఎలా ? దయచేసి స్పందించగలరు !
ReplyDeleteTata bye bye see you
Deleteహిందు మతం గురించి వ్రాసిన పుస్తకాలు కావాలి
ReplyDeleteహిందూమతంలో చెక్కుమడులు అనే పుస్తకము నాకు కావాలి
Deleteనాకు పైన వున్న బుక్స్ కావలె how can I contact
ReplyDeleteJai been
ReplyDelete